Thursday 7 June 2012

పెట్రోల్ ధర రూ.1.19 తగ్గింపు!

పెట్రోల్ ధర రూ.1.19 తగ్గింపు!
వ్యాట్ తగ్గింపునకు ఈసీ ఆమోదం
2 శాతం మినహాయిస్తూ.. సీఎం నిర్ణయం
గురువారం నుంచే అమల్లోకి?

హైదరాబాద్, జూన్ 6 : రాష్ట్రంలో పెట్రోల్ వాహనదారులకు మరింత ఊరట. పెట్రోల్ ధర లీటరు కు రూ.1.19 తగ్గనుంది. ఎన్నికల సంఘం అనుమతివ్వడంతో.. పెట్రోల్‌పై రెండు శాతం వ్యాట్‌ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గురువారం నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చమురు సంస్థలు పెట్రోల్ లీటరుకు రూ. 7.50 పెంచడంతో దేశవ్యాప్తంగా గగ్గోలు చెలరేగిన విషయం తెలిసిందే. దాంతో పెంచిన ధరలో లీటరుకు రూ. రెండు చొప్పున తగ్గిస్తూ.. చమురు సంస్థ లు నిర్ణయం తీసుకున్నాయి. 

మరోవైపు.. తాము విధిస్తు న్న వ్యాట్‌ను తగ్గించుకుంటే, పెట్రోల్ ధరలు మరింత త గ్గుతాయని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. పెట్రోలుపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 33 శాతం వ్యాట్‌లో కొంత తగ్గించాలని నిర్ణయించింది. దీనిపై వాణిజ్య పన్ను ల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం కిరణ్ మూడు శాతం మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 

దీనిపై బుధవారం ఈసీ నుంచి అనుమతి లభించింది. దీంతో సీఎం కిరణ్ వాణిజ్య పన్ను ల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పెట్రోల్‌పై రెండు శాతం వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోల్‌పై వ్యాట్ రూపంలో ఏటా రూ. నాలుగు వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం వ్యాట్‌ను రెండు శాతం తగ్గించడం వల్ల ఖజనాకు 186 కోట్ల రూపాయల ఆదాయం తగ్గనుంది.

No comments:

Post a Comment